వర్మ.. ఎందుకీ ఖర్మ!
ఇమేజ్ మొత్తం కోల్పోయిన వర్మ
ఒకప్పుడు భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సృజనాత్మక ధురంధరుడు రామ్ గోపాల్ వర్మ, నేడు కేవలం ఇతరుల సినిమాలపై పడి పాకులాడే పబ్లిసిటీ పిపాసి గా మారిపోయారు. ఆదిత్య ధర్ రూపొందించిన ధురంధర్ సినిమా సాధిస్తున్న విజయాన్ని అడ్డం పెట్టుకుని, తన ఉనికిని చాటుకోవడానికి వర్మ పడుతున్న తపన చూస్తుంటే.. ఆయన ఎంతలా దిగజారిపోయారో అర్థమవుతోంది. ఒకప్పుడు ఈయన అపాయింట్మెంట్ కోసం అగ్ర హీరోలు, పెద్ద ఛానళ్లు క్యూ కట్టేవి. కానీ నేడు, కనీసం గుర్తింపు లేని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, తన కొత్త సినిమా సిండికేట్ కు హైప్ తెచ్చుకోవాలని చూడటం ఆయన పతనానికి పరాకాష్ట.
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో దశాబ్దాల తరబడి పనిచేశారు కానీ, ఒక కళాకారుడికి ఇమేజ్ అనేది ఎంత ముఖ్యమో మర్చిపోయినట్లున్నారు. రంగీలా , సత్య , కంపెనీ వంటి అద్భుతాలు సృష్టించిన మేధావి.. ఇప్పుడు కేవలం వివాదాల మీద, ఇతరుల విజయాల మీద బతకడం ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధమే. తనను తాను ఎంతగా దిగజార్చుకోకూడదో అంతగా దిగజార్చుకున్నారు. ఆయన మాటల్లోని పదును తగ్గలేదు కానీ, ఆ మాటల వెనుక ఉన్న విలువ పూర్తిగా నశించింది. అందుకే ఇప్పుడు ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా, అది విశ్లేషణలా కాకుండా అటెన్షన్ సీకింగ్ డ్రామాలా అనిపిస్తోంది.
ధురంధర్పై అతి కంటే పెద్ద అతి
ప్రస్తుతం ధురంధర్ సినిమాపై వర్మ చేస్తున్న అతి మామూలుగా లేదు. ఆ సినిమా టెక్నికల్ అంశాల గురించి భారీ డైలాగులు కొడుతూ, ఇండస్ట్రీలోని గ్రూపిజంపై సెటైర్లు వేస్తూ తెగ హడావుడి చేస్తున్నారు. నిజానికి ఇదంతా తన సినిమా సిండికేట్ ను ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్న గిమ్మిక్కు అని సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమైపోతోంది. ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్గా ఉన్న వ్యక్తి, నేడు ఒక సక్సెస్ ఫుల్ సినిమా భుజాల మీద ఎక్కి తన బండిని లాగాలని చూడటం ఆయన స్థాయికి ఏమాత్రం తగదు. ఛానళ్లు పట్టించుకోకపోవడంతో, దిక్కూమొక్కూ లేని ప్లాట్ఫారమ్స్ మీద కూర్చుని ఫిలాసఫీ చెప్పడం వర్మ విషాద పతనానికి నిదర్శనం.
వర్మను ఇప్పుడెవరూ పట్టించుకోరు!
ఇప్పుడు వర్మ మళ్లీ రంగీలా తీస్తా అన్నా, సత్య తీస్తా అన్నా వినే నాథుడే లేడు. ఎందుకంటే, క్రియేటివిటీ కంటే వివాదాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తారన్న ముద్ర బలంగా పడిపోయింది. ఒక మేధావి తన మేధస్సును వినాశకరమైన పబ్లిసిటీ కోసం వాడితే ఏమవుతుందో వర్మను చూస్తే తెలుస్తుంది. ధురంధర్ వంటి సినిమాలను చూసి నేర్చుకోవాల్సింది పోయి, వాటిని తన స్వార్థం కోసం వాడుకోవాలని చూడటం ఆయన పతనానికి నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఎంత గింజుకున్నా, ఎంతగా ఇంటర్వ్యూలు ఇచ్చినా.. పాత వర్మను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు, కొత్త వర్మను ఎవరూ పట్టించుకోవడం లేదు.