భూదందా, రూ.50 లక్షలు డిమాండ్ – ముగ్గురు అరెస్ట్
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 23 :-
నలుగురిపై కేసు, ముగ్గురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీలో.
మొబైల్ ఫోన్లు స్వాధీనం.
మావల ఎస్హెచ్ఓ రాహుల్ కాంత్ ఐపీఎస్.
నిందితుల వివరాలు
బొజ్జ అజయ్,
గంగుల కిరణ్,
పిరంగి యోగేష్,
రాజ్ సిద్ధార్థ్ (పరారీలో)
మావల గ్రామం సర్వే నెం.167/1 కు సంబంధించిన భూమిపై అక్రమంగా ప్రవేశించి, యజమాని రాకేష్ శర్మను బెదిరిస్తూ రూ.50 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఘటనలో మావల పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాలలో
మార్చి 1న బొజ్జ అజయ్, గంగుల కిరణ్, పిరంగి యోగేష్, రాజ్ సిద్ధార్థ్ (పరారీలో) కలిసి బాధితుడి భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, డబ్బులు ఇవ్వకపోతే ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారు. స్థానికుల జోక్యం ఉన్నప్పటికీ తమ బెదిరింపులు కొనసాగించారు.
మార్చి 21న అందిన ఫిర్యాదు మేరకు మావల పోలీసులు క్రైం నెం.186/2026 కింద BNS సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా బొజ్జ అజయ్ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి ఒక ఆపిల్ ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంగుల కిరణ్, పిరంగి యోగేష్లను కూడా అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఒప్పో, రియల్మీ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ప్రధాన నిందితుడు బొజ్జ అజయ్ గతంలో కూడా ఇలాంటి నేరాల్లో పాల్గొన్నట్లు బయటపడింది. భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న రాజ్ సిద్ధార్థ్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి అని తెలిపారు.
ప్రజల ఆస్తి హక్కులను కాపాడటం పోలీసుల బాధ్యతగా భావిస్తూ, భూదందాలు మరియు బెదిరింపులపై కఠిన చర్యలు కొనసాగుతాయని మావల ఎస్హెచ్ఓ రాహుల్ కాంత్ ఐపీఎస్ తెలిపారు.