అంబేద్కర్ కూడలిలో ఘనంగా సామూహిక వందేమాతరం గీతాపాలన
పత్రికా ప్రకటన
మార్చి 24, 2026_ఆదిలాబాదు:
వందేమాతరం గీతం మన భారతీయతకు, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో డా.హెచ్.వి. వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, భారతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేమాతరం కేవలం ఒక గీతం మాత్రమే కాదని, అది మన భారతీయతకు, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. వికసిత్ భారత్ 2047, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా అభివృద్ధి బాటలో యువత పయనించలన్నారు. వచ్చే 25 ఏళ్లలో మన దేశంతో పాటు మన రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అగ్రగామిగా నిలవాలంటే నేటి విద్యార్థులే కీలకమని, మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. నేటి కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, రీల్స్ కు బానిసలవున్నారని, ఫోన్లను కేవలం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ వంటి మంచి పనులకే పరిమితం చేయాలని సూచించారు. అనవసరమైన సామాజిక మాధ్యమాలతో సమయాన్ని వృథా చేసుకోవద్దని, క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలపైనా దృష్టి సారించాలని విద్యార్థులకు వివరించారు.
అనంతరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ సామూహిక వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో వాజే సమితి సభ్యులు ప్రఫుల్ వాజే, దేవన్న ప్రఫుల్ యాదవ్, పట్టణ ప్రముఖులు సుహాసిని రెడ్డి, వేదా వ్యాస్, దేవిదాస్ దేశ్పాండే, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, యువత, ప్రజలు. తదితరులు పాల్గొన్నారు.