కాకతీయ యూనివర్సిటీలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేల్కొలుపు స్ఫూర్తి ర్యాలీ
కాకతీయ యూనివర్సిటీలో భారత జాతీయోద్యమ వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో మేల్కొలుపు స్ఫూర్తి ర్యాలీ నిర్వహించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు యూనివర్సిటీ మొదటి గేటు నుంచి రెండవ గేటు వరకు కాగడాలతో విద్యార్థులు ర్యాలీ చేపట్టి వీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి అజయ్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ వి. కావ్య, రాష్ట్ర నాయకులు డి. వినయ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. వారి పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయోద్యమ వీరుల ఆశయాలను విస్మరిస్తోందని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నదని విమర్శించారు. అలాగే దేశంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కించపరుస్తూ ప్రశ్నించే స్వరాలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూతన జాతీయ విద్యా విధానం-2020 అమలు వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం తగ్గిపోతుందని, పాఠ్యపుస్తకాలలో నుంచి చరిత్రాత్మక పోరాటాలు, శాస్త్రీయ సిద్ధాంతాలను తొలగిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
విద్యార్థులు, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య, ఉద్యోగాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.