మీ ఇంటికి - మీ డాక్టర్” మొబైల్ మెడికల్ యూనిట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్.
నంద్యాల (AIMA MEDIA): గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “మీ ఇంటికి – మీ డాక్టర్” విన్నూత్న ప్రాజెక్ట్లో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి ప్రారంభించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ (PGRS) ఆవరణలో సుమారు రూ. 1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ మెడికల్ యూనిట్ను కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు జి. రాజకుమారి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు అందుబాటులోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ వంటి సేవా సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ మొబైల్ మెడికల్ యూనిట్ మార్చి నుండి మే వరకు నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో సేవలు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సాంకేతిక నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.