మటన్.ఉడకలేదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితుడు.
AIMA న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన స్థానిక వ్యక్తి ఆదివారం రోజున మార్కెట్లో మటన్ కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి ఎంతో ఆశగా వండటం ప్రారంభించాడు. అయితే, గంటలు గడుస్తున్నా ఆ మాంసం అస్సలు ఉడకలేదు. ఒకటి కాదు, రెండు కాదు.ఏకంగా 20 సార్లు వేడి చేసినా, విజిల్స్ వేయించినా ఆ ముక్కలు మెత్తబడలేదు.
వ్యాపారి తనకు నాణ్యత లేని మాంసాన్ని విక్రయించి మోసం చేశాడని భావించిన ఆ వ్యక్తి, వినూత్నంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాడు. వండిన మాంసం పాత్రను అలాగే పట్టుకుని నేరుగా తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు.
ఉగాది పండుగ పురస్కరించుకొని మాంసం కొంటే ఇది అస్సలు ఉడకడం లేదు సార్ నన్ను మోసం చేసిన విక్రయదారుడిపై చర్యలు తీసుకోండి. అంటూ పోలీసులను వేడుకున్నాడు.
స్టేషన్కు మటన్ గిన్నెతో వచ్చిన బాధితుడిని చూసి పోలీసులు మొదట అవాక్కయ్యారు. సాధారణంగా భూతగాదాలు, గొడవలతో వచ్చే వారిని చూసే పోలీసులకు, ఉడకని మటన్ ఫిర్యాదు కొత్తగా అనిపించింది. చివరకు పోలీసులు అతనికి నచ్చజెప్పి, ఇలాంటి విషయాల్లో మున్సిపల్ అధికారులకు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో చేసేది ఏమీ లేక బాధితుడు అక్కడి నుండి వెనుదిరిగాడు.