యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 20, 2026_ఆదిలాబాదు:
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్' ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో 'టాస్క్' ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సులలో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, అలాగే, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ , ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నిష్ణాతులైన వారిచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని యువత ఈ ఉచిత, నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా, ఈడియం బండి రవి, టాస్క్ మేనేజర్ సాయి, బోధన సిబ్బంది, యువతీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.