జనగణన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు.
పత్రిక ప్రకటన
మార్చి 20, 2026_ఆదిలాబాదు:
శుక్రవారం స్థానిక టిటిడిసిలో సెన్సస్-2027 (జనగణన) పై టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్కులకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సెన్సస్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని, ఇందుకోసం సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేక యాప్లు, పోర్టల్స్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కింద ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందనీ, హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కింద మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియను చేపడతారనీ తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్లు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేటర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించి, ప్రతిరోజూ తహసీల్దార్లకు నివేదికలు అందించాల్సి ఉంటుందనీ, ప్రతి ఇంటితో పాటు ప్రతి వ్యక్తిని ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో పక్కాగా సర్వే జరగాలని ఆదేశించారు. ఎన్యూమరేటర్ల మధ్య పని విభజన సమానంగా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పర్యవేక్షకురాలు నలందప్రియ, మాస్టర్ ట్రైనర్లు వినయ్, జగన్, శ్రీహరి, ఇతర అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.