కుటుంబ సభ్యుడిని కోల్పోయాం.కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన భూమా కుటుంబ వీరాభిమాని, ముఖ్య అనుచరుడు సోక్కం వంశీకృష్ణ (గత రాత్రి) అనారోగ్యంతో అకాల మరణం చెందడం పట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రోజున అహోబిలం చేరుకున్న ఎమ్మెల్యే దంపతులు, వంశీకృష్ణ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల దంపతులు మాట్లాడుతూ వంశీకృష్ణ కేవలం ఒక అనుచరుడు మాత్రమే కాదు, మా కుటుంబంలో ఒక సభ్యుడిలా, ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. వంశీ ఇంత చిన్న వయసులో మమ్మల్ని విడిచి వెళ్లాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. అతని మరణం మాకు, పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.వంశీకృష్ణ కుటుంబానికి భూమా కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా తాము ముందుంటామని ఎమ్మెల్యే అఖిలప్రియ, భార్గవ్ రామ్ దంపతులు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.