*గోపాలకృష్ణ మఠంలో వైభవంగా ఉగాది వేడుకలు: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ*
పత్రిక ప్రకటన
మార్చి 19, 2026_ఆదిలాబాద్:
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్థానిక గోపాలకృష్ణ మఠం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మఠం ఆవరణలోని సత్యభామ రుక్మిణి, సంతోషిమాత, మహాలక్ష్మి ఆలయాలను కలెక్టర్, ఎస్పీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారు, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ పీఠాధిపతి యోగానంద సరస్వతి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ప్రజలందరికీ ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని, ప్రసాదాలను వారు స్వయంగా పంపిణీ చేసి నూతన పంచాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు అన్నమయ్య సంకీర్తనలు పాడారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సునీల్ కుమార్ లతో పాటు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు వి.రవీందర్, కె.రవీందర్, రాజు, నర్సోజి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.