శరీరంపై మచ్చలుంటే వైద్యులను సంప్రదించండి :- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్
@@ @@
ఆదిలాబాద్:- ప్రజలందరూ తమంత తాము పరీక్షించుకుని ఎలాంటి మచ్చలున్న సమీపంలోని వైద్య సిబ్బందిని,వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ( ఎల్సిడిసి) కార్యక్రమాన్ని డి. ఎం. హెచ్. వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 18 వ తేది నుండి 31వ తేదీ వరకు నూతన కుష్టు రోగులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తలతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శరీరంపై పాలిపోయిన, రాగి రంగు గల మొద్దు బారిన మచ్చలు, కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు ఎవరికైనా ఉన్నట్లయితే కుష్టు వ్యాధిగా అనుమానించి ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు. ఎం డి టి తో ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎండి టి చికిత్స లభిస్తుందని అన్నారు. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి అంగవైకల్యం కలగదని అన్నారు. కుష్టురహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ సహకరించాలని, తమ ఇంటికి సర్వే నిమిత్తం వచ్చే సిబ్బందికి సహకరించాలని కోరారు. కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్ మాట్లాడుతూ ఏ ఒక్కరిని వదలకుండా సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరిని పరీక్షించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సర్వే తీరును డి ఎం హెచ్ ఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దీపిక, డిప్యూటీ పారా మెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, సివో విష్ణు, ఎల్టీ నిజాముద్దీన్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.