భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం
జర్నలిస్టు: మాకోటి మహేష్
తేది: 12-03-2026
చిట్యాల పోలీసులు – సీసీఎస్ టీం జాయింట్ ఆపరేషన్లో నిషేధిత గంజాయి పట్టివేత – ఇద్దరు అరెస్ట్
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సీసీఎస్ టీం మరియు చిట్యాల పోలీసులు సంయుక్తంగా చిట్యాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద నిన్న సాయంత్రం సుమారు 5:30 గంటలకు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 1 కిలో 300 గ్రాముల నిషేధిత గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.65,000. అలాగే ఒక బైక్ మరియు సెల్ ఫోన్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు.
ఈ ఘటనలో
1. పోతుల నర్సింగరావు (57), నివాసం: చల్లగరిగ గ్రామం, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా.
2. పల్లెర్ల మధుకర్ (43), నివాసం: చల్లగరిగ గ్రామం, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా.
ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపిఎస్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు భూపాలపల్లి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. నిషేధిత మాదకద్రవ్యాల విక్రయాలు లేదా రవాణా గురించి ఎవరైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 8712658111 కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని కోరారు.
అదేవిధంగా చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. ఎవరికైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 100 డయల్ చేయాలని కోరారు.