పలుగు పట్టిన డీఆర్డీఓ విద్యా చందన
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం చేయాలి: డీఆర్డీఓ విద్యా చందన
కొత్తగూడెం మార్చ్ 17 ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో, ములకలపల్లి మండలం పాతగంగారం గ్రామపంచాయతీ పరిధిలోని జగన్నాధపురం గ్రామాన్ని మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యా చందన సందర్శించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైన్లు సోక్పిట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, వాటి పురోగతిని సమీక్షించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీటి నిల్వలను నివారించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ పనులు అత్యంత కీలకమని ఆమె అన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్పీఏ కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘాల ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, రుణాల సక్రమ వినియోగం, ఆదాయ వృద్ధి మార్గాలు, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగంపై సభ్యులకు మార్గదర్శకాలు అందించారు.స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారతకు బలమైన వేదికలని, ప్రతి సభ్యురాలు బాధ్యతతో వ్యవహరించి సంఘాలను బలోపేతం చేయాలని డీఆర్డీఓ విద్యా చందన సూచించారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె తెలిపారు.గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.