నంద్యాల హిందూ స్మశాన వాటిక స్వర్గధామం వెబ్ సైట్ ఆవిష్కరణ.
నంద్యాల (AIMA MEDIA): నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన స్వర్గధామం హిందూ స్మశాన వాటికల వెబ్ సైట్ మధుమణి సమావేశ భవనంలో నవనిర్మాణ సమితి అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామ చంద్ర రావు, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి ప్రారంభించారు.స్వర్గధామం వెబ్ సైట్ ను నంద్యాల నేషనల్ కంప్యూటర్స్ నిర్వాహకులు షణ్ముఖ శ్రీనివాస్, బోయిలకుంట్ల గ్రామ నివాసి సాయినాథ్ రెడ్డి సారథ్యంలో యువ సాంకేతిక ఇంజనీర్లు గౌసియా, లహరి, మణికుమార్ లు పూర్తి ఉచితంగా సేవా దృక్పథంతో రూపొందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన రావు మాట్లాడుతూ నంద్యాల ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక ఉన్న స్మశాన వాటిక, పి.వి. నగర్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలను పరిశుభ్రమైన, స్మశాన వాటికలుగా పట్టణ ప్రజల సహకారంతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఇక్కడ అందుతున్న సేవలు గురించి ఎక్కడ ఉన్న వారైనా తెలుసుకోవడం కోసం,వీటి అభివృద్ధి కొరకు సహాయం చేయ దలుచుకున్న వారికి అనువుగా వెబ్ సైట్ రూపొందించడం జరిగిందన్నారు. అనాధ శవాలకు పూర్తి ఉచితంగా సేవలను అందించడం జరుగుతున్నదని చెప్పారు.రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి,ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్ర రావు మాట్లాడుతూ మృతి చెందిన ప్రతి హిందువు కు గౌరవంగా అంత్యక్రియలను నిర్వహించుకునే విధంగా స్వర్గధామం నిర్వాహకుల సేవలు ప్రశంసనీయమన్నారు.రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వర్గధామం చేస్తున్న సేవలు వివిధ సోషల్ మీడియాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉందన్నారు.స్వర్గధామం స్మశాన వాటిక అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి. రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల స్వర్గధామం పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాలకు కూడా సేవలు అందించడం అభినందనీయమన్నారు.నవనిర్మాణ సమితి వ్యవస్థాపకులు శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ మృతదేహాలను భద్రపరచడానికి శీతలీకరణ కేంద్రాన్ని భవిష్యత్తు లో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల నవనిర్మాణ సమితి వ్యవస్థాపకులు శివకుమార్ రెడ్డి, పట్టణ ప్రముఖులు గెలివి రామకృష్ణ, శేషు బాబు, కశెట్టి కృష్ణమూర్తి, ప్రముఖ న్యాయవాది రావినూతల దుర్గాప్రసాద్, పరమేశ్వర రాజశేఖర్, దేవరశెట్టి శ్రీనివాసులు, ద్వారకా వసంత్, దాతలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.