విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మసీదులకు వాటర్ కూలర్లు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు జిల్లాలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మసీదులకు వాటర్ కూలర్లు అందజేశారు.
వేసవి కాలంలో మసీదులలో తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని ముస్లిం మత పెద్దలు చేసిన విజ్ఞప్తికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందించారు. నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్లోని తమ నివాసంలో ఇందుకూరుపేట మండలానికి చెందిన రాముడు పాళెం, మైపాడు, పాములవారి పాళెం, కొత్తూరు, పల్లిపాడు, నిడిముసలి మరియు డేవిస్ పేట గ్రామాల మసీదులకు వాటర్ కూలర్లను అందజేశారు.
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ… తమ అభ్యర్థనను గౌరవించి మసీదులకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించినందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలను గుర్తించి, కుల మతాలకు అతీతంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించే మనసున్న నాయకులని పేర్కొంటూ వేమిరెడ్డి దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు.