పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రికా ప్రకటన
మార్చి 13, 2026 _ఆదిలాబాదు:
అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని హమాలివాడలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యతతో ఇళ్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీలో పర్యటించిన ఆయన, పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రతి గల్లీలో పారిశుధ్యం మెరుగుపడాలని, మురుగు కాలువల నిర్వహణలో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, హౌసింగ్ డి.ఈ భగవంత్ రావు, ఏ.ఈ నసీర్, కౌన్సిలర్లు పద్మవర్ రాకేష్, గంట జీవన్, మెస్రం విలాస్, తోకల నరేష్, ఇజ్జగిరి సంజయ్, కాలనీవాసులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.