మానవత్వం చాటిన ఎన్ఆర్ఐ.....
ముగ్గురు దివ్యాంగ విద్యార్థుల విద్యకు అండగా ఆర్థిక సహాయం
విజయనగరం జిల్లా.రాజాం.
సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉందని చాటి చెప్పే సంఘటన రాజాంలో చోటుచేసుకుంది. దివ్యాంగ విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఓ ఎన్ఆర్ఐ వారి చదువుకు అండగా నిలిచి ప్రతినెలా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ కాశీనాధ్ బురిడి రాజాంలోని భవిత కేంద్రంలో చదువుతున్న ఇద్దరు దివ్యాంగ విద్యార్థులు, సారధి రోడ్డులోని మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుతున్న మరో విద్యార్థిని దత్తత తీసుకుని వారికి ప్రతినెలా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
నాలుగు నెలల క్రితం రాజాంలోని భవిత కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి పిల్లల పరిస్థితిని చూసి చలించి కుర్చీలు, వంట సామగ్రి వంటి అవసరమైన వస్తువులను విరాళంగా అందజేశారు. అలాగే విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ప్రతినెలా సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు.
ఆ మేరకు కొయ్యాన పూర్ణచంద్రు (కళ్లు లేని), కొమ్మ ప్రశాంత్ (చలన లోపం) కు ప్రతినెలా రూ.3 వేల చొప్పున, సారధి రోడ్డులోని మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుతున్న మల్లివీడు నీలందొరకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మన విలేజ్ సంస్థ అధినేత కాశీనాధ్ బురిడికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో బలహీన వర్గాలకు అండగా నిలిస్తే వారి జీవితాల్లో మార్పు తీసుకురాగలమని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.