"పారాక్వాట్ డైక్లోరైడ్" గడ్డి మందును నిషేదించాలని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్ (12.03.2026)
అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా మారిన "పారాక్వాట్ డైక్లోరైడ్"అనే గడ్డిమందును నిషేధించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు.ఎంపీ రవిచంద్ర ఢిల్లీలో గురువారం సాయంత్రం మంత్రి చౌహాన్ తో సమావేశమై గడ్డిమందు (పురుగుల మందు) వల్ల చోటు చేసుకుంటున్న అనర్థాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.విషపూరితమైన ఈ గడ్డిమందుకు విరుగుడు లేదని,చుక్క మింగినా ప్రాణాలు కోల్పోవాల్సిందేనని ఎంపీ రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని వైద్యులు కూడా నిర్థారించడం జరిగిందని మంత్రి చౌహాన్ దృష్టికి ఎంపీ రవిచంద్ర తీసుకువచ్చారు.ఈ పురుగుల మందును సుమారు 70 దేశాలు ఇప్పటికే నిషేధించడం జరిగిందని వినతిపత్రంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.ఈ విషపూరిత పురుగుల మందును నిషేధించి ఆత్మహత్యలు చోటు చేసుకోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు.