నిత్యం మా వెంటే. మీరే మా అండ.కార్యకర్తలకు భూమా కుటుంబం కృతజ్ఞతలు.
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.మాజీ మంత్రి, దివంగత నేత భూమా నాగిరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని భూమా ఘాట్ వద్ద గురువారం రోజున నివాళి కార్యక్రమం జరిగింది. భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల చిత్రపటాలకు స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ,భార్గవ్ రామ్ దంపతులు మరియు టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.మా నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్లి తొమ్మిదేళ్లు అవుతున్నా, అమ్మానాన్న లేని లోటు తెలియకుండా కార్యకర్తలే మాకు అండగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ, ఎన్ని కష్టాలు ఎదురైనా మమ్మల్ని సొంత బిడ్డల్లా గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రతి కార్యకర్తకు మా కుటుంబం తరపున పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాతో నడిచిన ప్రతి ఒక్కరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాము అని ఆమె పేర్కొన్నారు. అనంతరం టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంపై కార్యకర్తలు చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదని అమ్మ ,నాన్న ఆశయ సాధనలో కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని వచ్చే ఏడాది నాన్న10వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని విఖ్యాత్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భూమా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమా నాగిరెడ్డికి నివాళులర్పించారు.