ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక':జిల్లా కలెక్టర్ రాజర్షిషా
పత్రిక ప్రకటన
మార్చి 12, 2026_ఆదిలాబాదు:
జిల్లాలో "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్ లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆదిలాబాదు, బోథ్ ఎమ్మెల్యేలు పాయల శంకర్, అనిల్ జాదవ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు
ముందుగా జిల్లాలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ, వ్యవసాయ శాఖ (రైతు భరోసా, రుణమాఫీ), విద్యాశాఖ (అమ్మ ఆదర్శ పాఠశాల), ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమం, అటవీ శాఖ ద్వారా పర్యావరణ పరిరక్షణపై సంబంధిత, ఇతర శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని, ఈ ప్రత్యేక కార్యక్రమం మార్చి 6న ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగుతుందని అన్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, గ్రామ, వార్డు స్థాయిలో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, వార్డుల్లో వార్డు సభలు నిర్వహించి, అభివృద్ధి పనులపై సమీక్ష జరపాలని ఆదేశించారు. ప్రణాళికలో భాగంగా
మార్చి 6 నుండి 15 వరకు పరిశుభ్రతలో భాగంగా గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య పనులు, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్.
ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్.
మే 4 నుండి 9 వరకు రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయం, రెవెన్యూ, నీటి పారుదల శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి, పిల్లల రక్షణ 'డ్రగ్స్ కు నో' ప్రచారం, విద్య, యువత-క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటివి అమలు చేయడం జరుగుతుందని వివరించారు. కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లకు ఇది మొదటి శిక్షణ అని, సర్పంచులు, కౌన్సిలర్లు సమన్వయంతో పని చేసి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.
ఆదిలాబాదు శాసన సభ్యులు పాయల శంకర్ మాట్లాడుతూ, సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్లు, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మనం చేసిన పనుల ఆధారంగానే ప్రజలు భవిష్యత్తులో మనల్ని ఎన్నుకుంటారని తెలిపారు.
అనంతరం రైతులకు ఉచితంగా అందించేందుకు 500 రూపాయల విలువగల ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్ ను కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, డిఆర్డీఓ రవీందర్, డిపిఓ రమేష్, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా ఉద్యానవన అధికారి నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రాజు, సర్పంచ్ లు, మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.