సిరివెళ్ల మిట్ట వద్ద ఆగని ఆర్టీసీ బస్సులు. పండగ వేళ ప్రయాణికుల అవస్థలు.
AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివెళ్ల మిట్ట వద్ద ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉగాది, రంజాన్ వంటి వరుస పండగల సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో కలిసి దూర ప్రాంతాల నుండి వచ్చే వారు బస్సులు ఆపకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిట్ట వద్ద బస్సు కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా, డ్రైవర్లు బస్సులను ఆపకుండా వెళ్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అదనపు ఖర్చులతో పాటు ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, నంద్యాల మరియు ఆళ్లగడ్డ డిపో మేనేజర్లు తక్షణమే స్పందించాలని సిరివెళ్ల మిట్ట వద్ద అన్ని సర్వీసు బస్సులు ఆగేలా చర్యలు తీసుకుని, పండగ వేళ ప్రయాణికులకు ఊరట కలిగించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.