థాయ్ లాండ్ కు చెందిన కార్గో షిప్ ను ఇరాన్ తన క్షిపణులతో పేల్చేసింది.
భారత్ కు బయల్దేరిన కార్గో నౌకను పేల్చేసిన ఇరాన్.. భారీ నష్టం..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే ఇరాన్ తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. అయితే తాజాగా హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న థాయ్ లాండ్ కు చెందిన కార్గో షిప్ ను ఇరాన్ తన క్షిపణులతో పేల్చేసింది. థాయ్ లాండ్ జెండాలు కలిగిన ఈ నౌక భారత్ కు వస్తున్నట్లు సమాచారం.
హార్మూజ్ జలసంధి వద్ద థాయ్ లాండ్ కు చెందిన కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. థాయ్ లాండ్ జెండాలు కలిగిన మయూరీ నారీ అనే కార్గో నౌక థాయ్ లాండ్ కు చెందిన ప్రీషియస్ షిప్పింగ్ పీసీఎల్ అనే సంస్థకు చెందినది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరింది. హార్మూజ్ జలసంధి గుండా ఈ నౌక గుజరాత్ లోని ఖండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే హార్మూజ్ జలసంధి వద్ద ఈ కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. ఈ నౌకపై క్షిపణులతో దాడులకు పాల్పడింది. దాంతో నౌక ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
ఇక ఈ దాడుల సమయంలో కార్గో నౌకలో 23 మంది నావికులు ఉన్నారు. వీళ్లంతా థాయ్ లాండ్ కు చెందినవారే. వీరిలో 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురు గల్లంతు అయినట్లు సమాచారం. ఒమన్ కు చెందిన నావికులు వీరిని రక్షించి ఒమన్ లోని ఖసాబ్ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఈ నౌక వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక క్షిపణుల ధాటికి కార్గో నౌక భారీగా దెబ్బతిన్నట్లు రాయల్ థాయ్ నేవీ ప్రకటించింది. ఈ మేరకు నౌక చిత్రాలను విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ అయితే దాడి తామే చేసినట్లు ఏ గ్రూప్ కూడా ప్రకటన చేయలేదని తెలిపింది. మరోవైపు యూనైటెడ్ కింగ్డమ్ మేరీటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ తీరంలో మూడు కమర్షియల్ నౌకలపై దాడులు జరిగాయని పేర్కొంది. అయితే అందులో థాయ్ లాండ్ కు చెందిన మయూరీ నారీ నౌక ఉందో లేదో స్పష్టత లేదని స్పష్టం చేసింది