డిజిటల్ రూపంలో ముడుపులు..-ఫోన్పే, గూగుల్పే ద్వారా స్వీకరణ
-టౌన్ప్లానింగ్లో రెండోరోజూ ఏసీబీ తనిఖీలు
-క్షేత్రస్థాయిలో పలు భవనాల పరిశీలన
శ్రీకాకుళం: నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది ముడుపుల కోసం ఏకంగా డిజిటల్ ప్లాట్ఫాంలను వాడుకున్నారు.ఏసీబీ అధికారుల రెండోరోజు (బుధవారం) తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. భవన నిర్మాణ అనుమతులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూసినట్లు సమాచారం.
మంగళవారం కొందరు టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల వద్ద లెక్కచూపని నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ నగదుకు సంబంధించిన మూలాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. రికార్డులను కూడా సరిగా నిర్వహించడం లేదని తేలింది.
ముడుపుల కోసం ఏకంగా ఫోన్పే, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించి లంచాలు స్వీకరించినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. కొన్ని భవన నిర్మాణ దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా అనేక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు. బీపీఎస్ పథకం అధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా.. అందులో సగంకంటే ఎక్కువ దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్లోనే ఉంచినట్లు గుర్తించారు.
శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాలకు ఏసీబీ అధికారులు వెళ్లి ప్లాన్ అనుమతులు ఇచ్చిన భవనాలను పరిశీలించారు. ఆ భవనాల యాజమానులను, అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా ప్రశ్నించారు. గురువారం పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడికానున్నాయి.