ఏలూరు జిల్లా నూజివీడు బైపాస్లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నూజివీడు బైపాస్లోని పోతురెడ్డిపల్లి సర్కిల్ వద్ద టాటా ఏసీ వాహనం అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. మధిర నుంచి వివాహ సంబంధం విషయమై జంగారెడ్డిగూడెం వెళుతున్న టాటా ఏసీ వాహనం, ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే సమయంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, టాటా ఏసీలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.