తల్లిదండ్రుల చివరి కోరికైనా తీర్చండి…
హిందూపురం పట్టణంలోని సేవామందిరం ప్రశాంతి మందిరం వృద్ధాశ్రమంలో గత కొద్ది సంవత్సరాలుగా అనంతపురానికి చెందిన
బలిజ పెద్ద సిద్ధన్న, ఆర్టీసీ మాజీ డ్రైవర్గా పనిచేసి విశ్రాంతి తీసుకున్న అనంతరం నివసిస్తూ వచ్చారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారు.
ప్రశాంతి మందిరం సేవకులు ఈ విషయం గురించి ఫోన్ ద్వారా ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆయనకు ఉన్న ఇద్దరు కూతుళ్లు రావడం సాధ్యం కాదని, మీరు అంత్యక్రియలు నిర్వహించండి అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
దీంతో ప్రశాంతి మందిరం సేవకులు సిస్టర్ వల్సల ఈ విషయాన్ని టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఉమర్ ఫారూఖ్ ఖాన్ తన మిత్రబృందంతో కలిసి టిప్పు సుల్తాన్ షహీద్ మానవతా రక్తదాన సంఘం అధ్యక్షుడు షేక్ షబ్బీర్, ఉబెదుల్లా హుసేన్, నాజిమ్, ఉజేర్ తదితరులతో కలిసి హిందూ సాంప్రదాయాల ప్రకారం సిద్ధన్నకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ, హిందూ బలిజ పెద్ద సిద్ధన్నకు క్రైస్తవ సిస్టర్లు సేవలు చేయడం, అనంతరం ముస్లిం సోదరులు హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని అన్నారు. ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవడం, సహకరించుకోవడం దేశ అభివృద్ధికి, జాతీయ సమైక్యతకు, మత సామరస్యానికి మార్గం చూపుతుందని తెలిపారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో సహా ఇప్పటివరకు తమ టిప్పు సుల్తాన్ షహీద్ సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా వెయ్యికి పైగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఎవరికైనా అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు లేకపోతే తమకు 9346943336 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఉమర్ ఫారూఖ్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపకుండా, కనీసం వారి చివరి కోరికైనా తీర్చాలని ఈ ఘటన సమాజానికి ఒక గుణపాఠంగా నిలుస్తోంది.