ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
కామారెడ్డి ప్రతినిధి ( పాముల సంతోష్ కుమార్ )
తేది::07.03.2026
కామారెడ్డి జిల్లా శనివారం
నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భిక్కనూర్ లక్ష్మీ, చిట్యాల రాజమణిలకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు , వస్త్రాలు అందజేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో ఫోన్ ద్వారా మాట్లాడించి, లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ , జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కూలిపోయిన ఇళ్లను చూసి చలించిపోయి అధికారంలోకి రాగానే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయించడం ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
గ్రామంలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, గ్రామ సర్పంచ్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.