పేదల సొంతింటి కల సాకారం*: మంత్రి జూపల్లి
*డోప్టాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం*
పత్రికా ప్రకటన
మార్చి 06, 2026-ఆదిలాబాద్
*
పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం డోప్టాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుల ఇళ్ల వద్ద రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. "పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం ద్వారా ఎందరో సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతోందని, కొత్త ఇళ్లలో లబ్ధిదారులు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.