*ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా*
పత్రికా ప్రకటన
మార్చి 5, 2026_ఆదిలాబాదు:
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పై మండల, జిల్లా స్థాయి అధికారులకు ఆయన ప్రత్యేక అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగుపరచడం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల క్రోడీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకతతో నిర్వహించాలన్నారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలనీ, మండల, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేసి, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలనీ, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అంతకుముందు జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని విభాగాల వారీగా సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, జెడ్పి సీఈవో రవీందర్, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.