ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు కౌంటడౌన్! డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి..!
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో మరోసారి సమ్మె సైరన్ మోగుతోంది. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన కార్మికులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ, తమ సమస్యల పరిష్కారానికి మార్చి 13ను ఆఖరి గడువుగా నిర్ణయించారు.ఒకవేళ ఈ లోపు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే, మార్చి 18 నుండి సమ్మెకు వెళ్తామని వారు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించాయి. నిర్ణీత గడువులోగా సమస్యల పై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మెకు దిగుతామని కార్మిక నాయకులు హెచ్చరిస్తున్నారు.ఆర్టీసీ కార్మికులు ముఖ్యంగా వేతన సవరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ,సంస్థలో పని పరిస్థితుల మెరుగుదల వంటి అంశాల పై ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలో కార్మికుల పై పని భారం పెరిగిందని వారు పేర్కొంటున్నారు.కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ, “సంస్థను బలోపేతం చేయాలంటే ముందుగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వం మా డిమాండ్ల పై స్పందించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టడం తప్ప మరో మార్గం లేదు” అని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నిర్దిష్ట గడువు (డెడ్లైన్)ను ప్రకటించి చర్చలకు ఆహ్వానించారు.ఆర్టీసీ సమ్మె జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడొచ్చు. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఆధారపడే ఆర్టీసీ సేవలు నిలిచిపోతే రవాణా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.ప్రభుత్వ వర్గాలు మాత్రం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా డిమాండ్ల పై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో కార్మిక సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్లు సమాచారం.ఆర్టీసీ ఇప్పటికే భారీ అప్పులు, నష్టాలతో పోరాడుతున్న సంస్థగా నిలుస్తోంది. డీజిల్ ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు, ఆదాయం వ్యయాల్లో అసమతుల్యత సంస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ ప్రజలకు నిరంతర సేవలు అందించడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోంది.కార్మికుల డెడ్లైన్ నేపథ్యంలో ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య జరిగే చర్చలు కీలకంగా మారాయి. చర్చలు విజయవంతమైతే సమ్మె తప్పించే అవకాశం ఉంది. లేకపోతే తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో పెద్ద స్థాయి అంతరాయం కలగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.