జీడి రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలోని అజయ్పురం గ్రామాల్లో జీడి పిక్కలకు కేజీ 200 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని గిరిజన రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు . ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం, ఐదో షెడ్యూల్ సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా-రాలి నిర్వహించారు . ఈ సందర్భంగా గిరిజన సంఘం సహాయ కార్యదర్శి జీ.వాసు, పాంగి రమేషు, గిరిజన రైతు సంఘం నాయకుడు చిరంజీవి మాట్లాడారు.రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అసెంబ్లీ సమావేశాల్లో గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు . 80 కేజీల బస్తాకు 18,000 రూపాయలు, రాష్ట్ర జీడి కార్పొరేషన్ ఏర్పాటు, పంట విస్తరణకు రాయితీలు పునరుద్ధరణ, అంతర్కృషి పరికరాలు ఉచితంగా, ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు, నాణ్య మొక్కలు, ఉపాధి హామీ పథకంలో జీడి తోటల పనులు, పంట రుణాలు, వాతావరణ భీమా, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు .అనకాపల్లి జిల్లాలో 90 వేల ఎకరాల్లో జీడి సాగు, 25 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, వేలాది మంది గిరిజనులు-దలితులు దీనిపై ఆధారపడి ఉన్నారని నాయకులు తెలిపారు . నాన్-షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల్లో నీటి లేని మెట్ట భూముల్లో జీడి ప్రధాన వాణిజ్య పంటగా ఉందని, గిట్టుబాటు ధర లేక వ్యాపారులు తక్కువ ధరలకు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు . వరి, చెరకు, పత్తికి మద్దతు ధరలు ప్రకటిస్తున్న ప్రభుత్వం జీడిని పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు .ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో జీడి మద్దతు ధర, మార్కెట్ సౌకర్యాలు చర్చించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు . జీడి రైతులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .