శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం.
పాణ్యం (AIMA MEDIA): నెరవాడ గ్రామ పరిధిలోని స్థానిక శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు శాంతిరాం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం తెలిపారు. “రక్తదానం మహాదానం. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదు. విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వకారణం” అని అన్నారు. ఈ శిబిరం ద్వారా సమాజంలో రక్తదానంపై అవగాహన పెంపొందించడమే కాక, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన రక్తాన్ని అందించేందుకు సహాయపడుతుందని, రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటంతో పాటు, దాతల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందన్నారు. హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి రక్తదానము ఎంతో అవసరమని, యువతలో మానవతా విలువలు పెరుగుతాయని తెలియజేశారు. ప్రస్తుత దినాలలో కిడ్నీ డయాలసిస్, యాక్సిడెంట్స్ మరియు ఇతరత్రా వ్యాధుల ద్వారా బాధపడుతున్న వారికి మా కళాశాల తరపున రక్తదానం చేస్తున్నామని తెలిపారు.రక్తదానం చేయడానికి ముందుగా వైద్య బృందం ప్రతి దాతకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, తగిన జాగ్రత్తలతో రక్త సేకరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, మెడికల్ ఆఫీసర్ డా. జానకి, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ సురేష్, వైద్య సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.