logo

అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టా?......

అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంక్షలు
‘ప్రెస్’ హక్కును కార్డుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం
సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులపై ప్రజాధర్మ పార్టీ తీవ్ర ఖండన
సమాచార పౌర సంబంధాల శాఖ జారీ చేసిన తాజా ప్రకటన జర్నలిస్టుల స్వేచ్ఛను కట్టడి చేసే దిశగా ఉందని ప్రజాధర్మ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకునేందుకు అనుమతి ఉంటుందని, అక్రిడేషన్ లేని వారు అలా రాసుకుంటే మోటారు వాహన చట్టానికి విరుద్ధమని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం అక్రిడేషన్ లేని జర్నలిస్టులు లేదా ఇతర సంస్థలకు చెందిన వారు వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొనడం జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్యగా ప్రజాధర్మ పార్టీ అభిప్రాయపడింది.
అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టా?
అక్రిడేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టేనా?
అక్రిడేషన్ కార్డు ఉండి వార్తలు రాయకపోయినా అతను జర్నలిస్టు అవుతాడా?
అక్రిడేషన్ కార్డు లేకుండా నిజాయితీగా వార్తలు రాస్తున్నవారు జర్నలిస్టులు కారా?
ఈ మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని చుంచు కుమార్ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డు ఉన్నవాళ్లందరూ జర్నలిస్టులు కాదని, అలాగే దేశంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు లేవన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
‘ప్రెస్’ అనేది వృత్తి గుర్తింపు… ప్రభుత్వ అనుమతి కాదు
‘ప్రెస్’ అనేది ఒక ప్రభుత్వ ముద్ర కాదని, అది జర్నలిస్టు వృత్తి గుర్తింపని ప్రజాధర్మ పార్టీ స్పష్టం చేసింది. అక్రిడేషన్ అనేది ప్రభుత్వ సౌకర్యార్థం జారీ చేసే పరిపాలనా పత్రం మాత్రమే తప్ప, జర్నలిస్టు హోదాకు ప్రమాణం కాదని పేర్కొన్నారు. అలాంటి అక్రిడేషన్‌ను ఆధారంగా చేసుకుని ‘ప్రెస్’ అనే పదాన్ని వాడే హక్కును పరిమితం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన దిశగా మారుతుందని హెచ్చరించారు.
భయపెట్టి నోరు మూయించే ప్రయత్నమా?
వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని నిషేధించడం ద్వారా జర్నలిస్టులను రోడ్లపైనే అనుమానితులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ప్రజాధర్మ పార్టీ ఆరోపించింది. ఇది కేవలం చట్ట అమలు చర్య కాదని, ప్రశ్నించే స్వరాన్ని భయపెట్టి మౌనమయ్యేలా చేసే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా పనిచేసే హక్కు ఉందని, మాట్లాడే హక్కు, రాసే హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కులేనని చుంచు కుమార్ స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాజరికమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జీవోను వెంటనే రద్దు చేయాలి
అక్రిడేషన్ ఆధారంగా ‘ప్రెస్’ హక్కును కట్టడి చేసే ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ప్రజాధర్మ పార్టీ డిమాండ్ చేసింది. అవసరమైతే అక్రిడేషన్ దుర్వినియోగంపై విచారణ చేయవచ్చని, కానీ జర్నలిస్టులందరినీ ఒకే గూటికి కట్టి అనుమానించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఈ ఉత్తర్వులు జర్నలిస్టులపై మానసిక ఒత్తిడిని పెంచేవిగా ఉన్నాయని, వాటిని కొనసాగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ, ప్రజాధర్మ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చుంచు కుమార్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

9
255 views