
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు సిట్ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ పీఎస్కు ఆయన చేరుకున్నారు. హరీశ్రావు వెంట న్యాయవాదులను పీఎస్ లోపలికి పోలీసులు అనుమతించలేదు. పోలీస్స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని హరీశ్రావుకు సోమవారం సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్ సిబ్బంది నోటీసులను కోకాపేటలోని ఆయన ఇంట్లో ఇచ్చి వెళ్లారు.
దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులు మొదలు జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024 మార్చిలో కేసు నమోదైంది. అనంతరం జరిగిన పరిణామాల్లో ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్రావు విదేశాలకు పారిపోవడంతో దర్యాప్తుకు ఆటంకం ఏర్పడింది. మిగతా నిందితులను అరెస్టు చేసినప్పటికీ ప్రభాకర్రావు అందుబాటులో లేకపోవడంతో చాలాకాలంపాటు దర్యాప్తు నిలిచిపోయింది. గత జూన్లో ప్రభాకర్రావు హైదరాబాద్ రావడంతో దర్యాప్తు ఊపందుకుంది