బ్రహ్మపుర- విశాఖ ఎక్స్ప్రెస్ రైలుకు తిలారు వద్ద హాల్ట్
ఏ పీ లో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. బ్రహ్మపుర - విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు (18525/26) ఏపీలో కొత్త హాల్ట్ అందుబాటులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని తిలారు రైల్వే స్టేషన్లో..బ్రహ్మపుర- విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ సౌకర్యం ఇచ్చారు. శనివారం రోజున తిలారు రైల్వే స్టేషన్లో బ్రహ్మపుర-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పచ్చ జెండా ఊపారు. దీంతో ఇక నుంచి బ్రహ్మపుర- విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలు తిలారు రైల్వే స్టేషన్లోనూ ఆగనుంది.మరోవైపు ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలోని మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ ముఖ్యమైన రైళ్లు ఆగేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తిలారు, ఉర్లాం రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించే విషయంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కేంద్ర మంత్రిని కోరారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పలు ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ ఇస్తూ రైల్వే శాఖ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.ఇటీవల కాలంలో శ్రీకాకుళంలోని గ్రామీణ ప్రాంత రైల్వే స్టేషన్లలో అనేక నూతన సర్వీసులను, కొత్త హాల్టును మంజూరు చెయ్యడం ద్వారా కనెక్టివిటీని మరింత మెరుగుపరిచామని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు, సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.మూడు రైళ్లకు శ్రీకాకుళం జిల్లాలో హాల్టింగ్మరోవైపు శ్రీకాకుళం జిల్లావాసుల దీర్ఘకాలిక డిమాండ్ను కేంద్రం ఇటీవల నెరవేర్చింది. శ్రీకాకుళం జిల్లాలోని వేలాదిమంది రైలు ప్రయాణికులకు ఊరట నిచ్చేలా.. రైల్వేశాఖ కీలక రైళ్లకు.. శ్రీకాకుళం జిల్లాలోని రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఇచ్చింది. పూరి-అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇచ్చాపురం వద్ద, బ్రహ్మపుర-విశాఖపట్నం ఎక్స్ప్రెస్కు తిలారు వద్ద.. అలాగే భువనేశ్వర్-న్యూ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు బారువ రైల్వేస్టేషన్ వద్ద హాల్ట్ సౌకర్యం కల్పించారు.ఈ క్రమంలోనే బ్రహ్మపుర- విశాఖ ఎక్స్ప్రెస్ రైలుకు తిలారు వద్ద హాల్ట్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. మిగతా రెండు రైళ్లకు కూడా త్వరలోనే నిలుపుదలలు అమల్లోకి తేనున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.