
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లడం కంటే.. వందే భారత్లో బెజవాడ వెళ్లడమే ఈజీ..!
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి కూటమి గాలి తీసేంత పనిచేశారు.. భోగాపురం ఎయిర్పోర్ట్పై క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందుకు విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం వేదికైంది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లడం కంటే.. వందే భారత్ లో విజయవాడ వెళ్లిపోవడమే సులభం అన్నారు విష్ణుకుమార్ రాజు… ఇందు కోసం ఎంపీ భరత్ చొరవ తీసుకుని అదనంగా రెండు వందే భారత్ రైళ్లు వచ్చేలా చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్గత రహదారులు నిర్మాణం పూర్తి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని విష్ణు చేసిన సూచన చర్చనీయంశంగా మారింది. అలాగే, ప్రస్తుతం వున్న విశాఖ ఎయిర్పోర్టు మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకం అన్నారు విష్ణు. ఈ దిశగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని గట్టిగా వాదించడం సహచర ఎమ్మెల్యేల్లో చర్చకు కారణం అయింది. ఇటీవల ప్రభుత్వం కు మైలేజ్ వస్తుందని భావిస్తున్న అంశాల మీద బీజేపీ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.