
పల్లంపల్లిలో ఘనంగా “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమం
45 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
వీరులపాడు మండలంపల్లంపల్లి గ్రామంలో సోమవారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పల్లంపల్లి రెవిన్యూ పరిధిలోని 45 మంది రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులుకల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ రాజ్యముద్రతో జారీ చేసిన పాసు పుస్తకాల ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, వ్యవసాయ పెట్టుబడులు సులభంగా లభిస్తాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపారు.