logo

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.

డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.

0
121 views