logo

స్క్రబ్ టైఫస్‌ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించండి: జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి.

నంద్యాల (AIMA MEDIA): నల్లి, ఇతర కీటకాల ద్వారా సంక్రమించే స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్ లో స్క్రబ్ టైపస్ వ్యాధి నియంత్రణపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ మల్లీశ్వరి డిఎంహెచ్వో వెంకటరమణ రాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు శ్రీనివాసరావు రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ  జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కాకుండా గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జ్వరం లక్షణాలు కనబడిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించేలా జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్క్రబ్ టైఫస్ అని పిలిచే ఈ వ్యాధి చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు వల్ల వస్తుందని, ముఖ్యంగా పొలాలు, గడ్డి ప్రదేశాలు, పొదలు, పశువుల కాటిళ్లు వంటి ప్రాంతాల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని డాక్టర్లు కలెక్టర్ కు నివేదించారు. తెలిపారు. చిగ్గర్ కాటు వేసిన ప్రదేశంలో నల్లని మచ్చ (ఎస్కార్) కనిపించడం ఈ వ్యాధికి ప్రత్యేక లక్షణమన్నారు. 5 రోజులకుపైగా జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, బలహీనత, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే స్క్రబ్ టైఫస్ అనుమానం కలుగుతుందని, రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చని తెలిపారు.ఈ వ్యాధి పూర్తిగా నయమయ్యేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్సీసైక్లిన్ లేదా అజీథ్రోమైసిన్ వంటివి వైద్యుల పర్యవేక్షణలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. వ్యాధి నివారణలో ప్రజల పాత్ర ఎంతో ముఖ్యమైనందున ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. పొలాలు, గడ్డి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పూర్తిచేతుల చొక్కాలు, పూర్తి ప్యాంట్లు, మూసివున్న బూట్లు ధరించి జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో నేలపై కూర్చోవడం తప్పనిసరి అయితే గుడ్డ లేదా పరుపు ఉపయోగించాలని, ఇళ్ల చుట్టూ గడ్డి, పొదలు తొలగించి శుభ్రతను కాపాడాలన్నారు.  అలాగే గ్రామ పరిసరాల్లో మైట్ నివాసాలను తగ్గించేందుకు అవసరమైన చోట కీటకనాశకాలు ఉపయోగించాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ వ్యక్తి నుంచి వ్యక్తికి పాకదని, ఇది పూర్తిగా చిగ్గర్ కాటు ద్వారా మాత్రమే వస్తుందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జ్వరం ఎక్కువ రోజులు కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే సంప్రదించి అవసరమైన చికిత్స పొందేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.

1
290 views