logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న ఆందోళన… విద్యా వ్యవస్థలో మార్పుల అవసరం

హైదరాబాద్,2 డిసెంబర్ 2025 (తటవర్తి భద్రిరాజు, AIMA MEDIA ప్రతినిధి)

రాష్టం లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌ బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో మరో విద్యార్థిని వర్షిత ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారం కలిగించింది. హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని . అసలు ఆత్మహత్య కు కారణాలు ఏమిటి? పిల్లలను ఇంత పెద్ద ఒత్తిడికి నెట్టే పరిస్థితులు ఏమిటి ? అనే ప్రశ్నలు మరోసారి వెలువడుతున్నాయి.

పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడి – ప్రమాదకర ధోరణి

తల్లిదండ్రుల అంచనాలు, మార్కులపైనే ఆధారపడిన భవిష్యత్తు అంటూ విద్యార్థులపై పడుతున్న ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరింది. ర్యాంకులు, మెడికల్-ఇంజినీరింగ్ సీట్లు, టాపర్‌ కావాలి అన్న మానసిక ఒత్తిడి అనేక మంది పిల్లల్లో భయం, నిస్సహాయతను పెంచుతోంది.
కార్పొరేట్ కాలేజీల్లో ఉదయం నుండి రాత్రి వరకు క్లాసులు, పరీక్షలు, స్టడీ అవర్స్… పిల్లలకు స్వేచ్ఛ, ఆటపాటలు, విశ్రాంతి అనే మాటలు కూడా కనిపించడం లేదు. ఇలాంటి వాతావరణం వారికి తీవ్ర మానసిక భారంగా మారుతోంది.

విద్యావిధానంలో మార్పులు తక్షణం అవసరం

ప్రస్తుతం విద్యా వ్యవస్థ మొత్తం మార్కులు—ర్యాంకులు—కాంపిటేషన్‌ చుట్టూ తిరుగుతోంది.
ఈ ఒత్తిడి పై నిపుణులు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు.

విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించే సమతుల్య విద్యా విధానం అవసరం.

అకాడమిక్‌ మార్కులతో పాటు నైపుణ్యాలు, క్రియేటివిటీ, ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

హాస్టళ్లలో కౌన్సెలింగ్‌ సెషన్లు, మానసిక ఆరోగ్యం పరిశీలనలు తప్పనిసరి చేయాలి.

వారానికి కనీసం ఒక రోజు స్ట్రెస్-ఫ్రీ డే అమలు చేయాలి.

విఫలమైతే భవిష్యత్తు పోయిందన్న భావన తొలగించేందుకు పాఠశాల స్థాయిలోనే సరైన అవగాహన ఇవ్వాలి.


ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు

తాజా ఘటన మరోసారి ప్రభుత్వం ఈ అంశం పై దృష్టి పెట్టవల్సిన అవసరం ను సూచిస్తుంది. నిపుణులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వం తీసుకోవాలి అని కోరుతున్న కీలక చర్యలు ఇవి:

కార్పొరేట్ కాలేజీలపై కఠిన పర్యవేక్షణ, హాస్టల్‌ నియమాలు, అధ్యయన సమయాలపై నియంత్రణ.

ప్రతి విద్యాసంస్థలో సైకాలజిస్టులు, కౌన్సెలర్లు తప్పనిసరి.

ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులపై హెల్‌ప్‌లైన్‌, అత్యవసర స్పందన వ్యవస్థ ఏర్పాటు.

విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించే మాసిక రిపోర్టులు పాఠశాల–తల్లిదండ్రులకు పంపే విధానం.

తీవ్ర ఒత్తిడి కలిగించే విధంగా అతి పొడవైన స్టడీ అవర్స్, రాత్రి క్లాసులకు నియంత్రణ.


తల్లిదండ్రుల బాధ్యత కూడా కీలకం

అన్ని మార్కులపైనే ఆధారపడి పిల్లల భవిష్యత్తు నిర్ణయించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలకి ప్రోత్సాహం, అర్థం చేసుకోవడం, మాట్లాడే అవకాశం ఇవ్వడం కుటుంబాలు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు.
వాళ్ల భయాలు, సమస్యలు వినడం—తేలికగా తీసుకోకపోవడం—పిల్లల మనసులోని ఒత్తిడిని దూరం చేస్తాయి.

విద్యార్థుల ప్రాణాలు అమూల్యం. ఒక పరీక్షలో విఫలమైతే జీవితం విఫలమైపోయిందని భావించే పరిస్థితిని సమాజం మారుస్తేనే ఇలాంటి దుర్ఘటనలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

81
2601 views

Comment