logo

తాపీ ధర్మారావు

దేవుడి వైపు కాళ్ళు పెట్టి చదువుకుంటున్నావేమిటి ? తియ్ ! అని కోప్పడిన తల్లితో దేవుడు అందుగలడిందులేడని సందేహంబు వలదు అన్నారు కదమ్మా ! మరి కాళ్ళెక్కడ పెట్టుకోవాలి ? అని కుర్రతనంలోనే అహేతుక భావాలను ప్రశ్నించిన గడుగ్గాయి, నూనె కావడి ఎదురొస్తే అశుభం అని అందరూ వారించినా లెక్కచేయకుండా వెళ్లి ఎఫ్.ఏ పరీక్ష ఫస్ట్ క్లాసులో పాసైన తెలివైన నాస్తికుడు,
పెద్దయ్యాక దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? అని ఆలొచించడమే కాక ఏకంగా పుస్తకమే రాసి భక్తజనావళికి చెమటలు పట్టించిన హేతువాది, 1887 సెప్టెంబర్ 19న బరంపురంలో పుట్టిన తాపీ ధర్మారావు గారి ఇంటిపేరు బండివారో బండారువారో అని ఉండేదట. వీరి తాతగారు తాపీ పనిలో పేరు తెచ్చుకోవడం వల్ల అదే ఇంటిపేరుగా స్థిరపడిపోయింది.
నూతన పోకడలపై మొదటినుంచీ ఆసక్తే.. బడి రోజుల్లో పంచెకట్టుకోవాలనిపించి అందరూ ఎడమచేతి వైపు గోచీ పెడితే " ఏం ? అలాగే ఎందుకు కట్టాలి ? అంటూ కుడిచేతి వైపు పెట్టి కట్టుకుని బడికి వెళ్లారు. అందరూ నవ్వారు.మాస్టారు హెచ్చరించారు." నేనిలాగే కడతానని ఎదురు చెప్పడమే కాదు.జీవితాంతమూ అలాగే కట్టారు.
తన పెళ్లి విషయంలో ఆనాటి సంప్రదాయంపై తిరుగుబాటు:
పెళ్లి చూపుల్లో పిల్లకు చదువు తప్పని సరి. పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకోవాలి. కట్నాల ప్రసక్తి కూడదు. భార్యను ఏమేవ్ , ఏయ్ అని కాకుండా పేరుపెట్టి పిలుచుకోవాలి. నాటకాలకు వెళ్ళినప్పుడు వెంటతీసుకెళ్లి తన పక్కన కూర్చోబెట్టుకోవాలి అనే షరతులు పెట్టారు. ఈనాడివి అల్ప విషయాలు.కానీ 1902-1903 కాలంలో అభ్యుదయ భావాలు.
లెక్కల మాస్టారుగా ఉద్యోగం ప్రారంభించి ఉప్పల లక్ష్మణరావు గారూ, వి.వి.గిరి వంటి వారికీ పాఠాలు చెప్పారు. కొన్నాళ్ళు సర్వే డిపార్టుమెంట్ లో పనిచేసి,తరువాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు.బొబ్బిలి రాజా సోదరుడికి ట్యూటర్ గా పనిచేశారు.చివరకు పత్రికా రంగంలో స్థిరపడ్డారు.
దేవాలయాలపై కనిపించే బూతుబొమ్మలన్నీ గుడులలో జరిగే సంగమాలను తెలిపేవే అంటూ 1936లో ప్రజామిత్ర పత్రికలో రాసిన వ్యాసాలను దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు ? అనే పుస్తకంగాప్రచురించారు.అదే పత్రికలో ' కొత్తపాళీ ' వ్యాసాలను ధారావాహికంగా ప్రచురించారు. తనకు పుట్టినవాడే తన ఆస్తికి వారసుడు కావాలన్న తపనే 'ఇనుప కచ్చడాలు'కు మూలం అన్నారు. 'అడగజాలనివాడు' అనే పేరుతొ రాసిన వ్యాసాలను "ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ" పుస్తకంగా వెలువరించారు.
ఆదిలో మగపెళ్లి వారూ ఆడపెళ్ళివారూ తప్ప మరొకరితో నిమిత్తం లేకుండా ఒకరికొకరు తమలపాకులు ఇచ్చుకోవడం వంటి అతి సామాన్య తంతులోకి పిలవని పేరంటంగా పురోహితుడు ప్రవేశించి ఏవోవో మంత్రాలు అల్లి నానా రకాల కర్మకాండను కల్పించి పెళ్లిని " పెద్ద భూతంగా ఎలా మార్చాడో " పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు" లో వివరించారు.1937లో సినీరంగం లో అడుగుపెట్టి మొదట " మోహినీ రుక్మాంగద " కీ, చివరగా 1962లో " భీష్మ సినిమాకీ సంభాషణలు రాశారు. చేమకూర వెంకటకవి ' విజయవిలాస' కావ్యానికి సహృదయోల్లస వ్యాఖ్య రాసి సంప్రదాయ పండితుల ప్రశంసలందుకున్నారు.
ఏదైతేనేం వెయ్యిముఖాలతో వెలిగిన జీవితం పూలబాటలూ ముళ్లపుంతలూ చవిచూసిందని "రాళ్ళూ రప్పలూ " వర్ణించిన 86 సంవత్సరాల జీవితం అలసిపోయి 1973 మే 8 న శాశ్వత విశ్రాంతి తీసుకుంది.
ప్రసిద్ధి తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు
హేతువాది, తాపీ ధర్మారావు గారి జయంతి నేడు…నివాళులు !🙏
తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 - మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు. ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.
ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు. తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు
ఆయన రాసిన రచనలు
ఆంధ్రులకొక మనవి
దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
ఇనుపకచ్చడాలు
సాహిత్య మొర్మొరాలు
రాలూ రప్పలూ
మబ్బు తెరలు
పాతపాళీ
కొత్తపాళీ
ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
విజయవిలాసం వ్యాఖ్య
అక్షరశారద ప్రశంస
హృదయోల్లాసము
భావప్రకాశిక
నల్లిపై కారుణ్యము
విలాసార్జునీయము
ఘంటాన్యాయము
అనా కెరినీనా
ద్యోయానము
భిక్షాపాత్రము
ఆంధ్ర తేజము
తప్తాశ్రుకణమ
లభించిన పురస్కారాలు.
1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.

3
88 views