logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ 26వ డివిజన్‌లో కూటమి నాయకుల నేతృత్వంలో సేవా కార్యక్రమం

మచిలీపట్నం ఆగష్టు 01(వార్త బలం ప్రతి నిధి) : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రతి నెల మొదటి తేదీన జరుగుతున్న ఈ కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇంటివద్దకే పింఛన్ అందించే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది సహకారంతో నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని వార్డు టిడిపి అధ్యక్షులు చెరుకూరి సూరిబాబు, ప్రధాన కార్యదర్శి దిక్కొళ్ళు వెంకట్రావు, టిడిపి సీనియర్ నాయకులు షేక్ మౌలాలి, నాగనబోయిన రవి, బూత్ ఇన్‌చార్జులు వన్నెం రెడ్డి ప్రసాద్, షేక్ బాషా ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ, డివిజన్‌కు చెందిన 4375 జనాభాలో 442 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారని, వారి అందరికీ సకాలంలో పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ రోజు జరిగిన పంపిణీలో రూ.19 లక్షల 40 వేల పింఛన్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి సహకారంతో మచిలీపట్నం అభివృద్ధి బాటలో ఉందని గడ్డం రాజు వివరించారు.

కేంద్ర రాష్ట్ర నిధులతో మచిలీపట్నం క్యాపిటల్ సిటిగా అభివృద్ధి చెంది, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని, కొత్తగా గుర్తించిన వారికి కూడా పింఛన్లు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గడ్డం రాజు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పింఛన్ లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

110
1573 views

Comment