
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, నిజామాబాద్ జిల్లా నూతన ఇంచార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో
మంగళవారం నిజామాబాద్ లోని ఈవీఎం గార్డెన్స్ లో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ,సన్నబియ్యం, రైతు భరోసా, సన్నాలకు బోనస్, పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీలు,సబ్సిడీ సిలిండర్, ఉచిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు ప్రోత్సాహం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కొత్త నోటిఫికేషన్లు, యువత ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ,ప్రభుత్వ పాఠశాలల బలోపేతం,రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కాబట్టి మనమందరం వీటిని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.