logo

వ్యాపార కేంద్రాలుగా ప్రైవేటు పాఠశాలలు.. చదువు కొనేదెలా..?

పాఠశాలలో సీబీఎస్ సిలబస్ తో విద్యా బోధన చేస్తామని, ఈ ఏడు మా పాఠశాలలో చదివిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారని, డిజిటల్ క్లాసుల బోధన, కంప్యూటర్ తరగతుల నిర్వహణ, ఏసీ గదుల్లో విద్యాబోధన వంటి మాటలు చెబుతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తూ వారిని పాఠశాలలకు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. తీరా తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు తీసుకుని వెళ్లగా అక్కడ నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి డొనేషన్లు వసూలు చేస్తున్నారు.

సీటు కోసం ఎవరితో పైరవీ చేయించినా తగ్గేదేలే అంటూ డొనేషన్లు చెల్లిస్తేనే పాఠశాలలో సీటు కేటాయిస్తున్నారు. ఈ విషయమై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో గల దాదాపు అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, స్కూళ్లలో తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నాయి. అయినా విద్యాశాఖ చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది.

విద్యా హక్కు చట్టానికి తూట్లు...

విద్యాహక్కు చట్టానికి ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ పాఠశాలలు తూట్లు పొడుస్తున్నాయి. చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో డొనేషన్లు, ఫీజుల వసూళ్ల నియంత్రణ కు నియమనిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేసిన కమిటీ సమ్మతితోనే ఫీజులు వసూళ్లు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ఇది ఏ పాఠశాలలోనూ అమలు కావడం లేదనేది జగమెరిగిన సత్యం. ఈ కమిటీ ఉంటే ఎలా పడితే అలా ఫీజులు, డొనేషన్లు వసూలు చేయ రాదనే ఉద్దేశంతో అసలు ఈ కమిటీ ఊసే కనిపించడం లేదు. నిర్దేశించిన డొనేషన్లు కచ్చితంగా తీసుకుంటూ తల్లిదండ్రులను ఆర్థికంగా నష్టాలకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పై విమర్శలు వస్తున్నాయి.

యధేచ్చగా పుస్తకాలు, టై బెల్టుల విక్రయాలు..

ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠశాలలను బుక్ స్టోర్ కేంద్రాలుగా మార్చి తమ దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కుల అమ్మకాలు జరుపుతున్నారు. ఏకంగా మరికొన్ని పాఠశాలలు అయితే పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు టైబెల్టులు, డ్రెస్సులు, షూస్ కూడా విక్రయిస్తున్నారు. అధికారులకు విషయం పొక్కకుండా ఉండేందుకు తల్లిదండ్రుల వద్ద సంబంధిత పాఠ్య, నోట్ పుస్తకాలతో పాటు టైబెల్టులకు డబ్బులు తీసుకుని వారి ఇళ్లకు పార్శిల్ పంపిస్తున్నారు. మరి కొన్ని పాఠశాలలు బుక్ స్టోర్లను కేంద్రాలుగా చేసుకొని తమ పుస్తకాల అమ్మకం దందాను కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు, ఇతర సామగ్రి అమ్మకాలు జరపకూడదు.

ఈ నిబంధనలు తమకు భారీ నష్టాన్ని మిగులుతాయని భావించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమానులు కొత్త డ్రామాకు తెరలేపారు. తమ పాఠశాలలో విక్రయాలు జరిపితే అధికారులతో పాటు విద్యార్థి సంఘాలతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, వారి దందాకు మధ్య వర్థులుగా బుక్ స్టోర్లను చేర్చుకొ ని తమ వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు తమకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న దుకాణాల్లోనే పుస్తకాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలిసింది. తాము సూచించిన దుకాణాల్లో కాకుండా వేరే దుకాణాల్లో పుస్తకాలు కొనుగోలు చేస్తే, అవి చెల్లుబాటు కావని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమానులు చెబుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

నిలువు దోపిడీ చేస్తున్న పాఠశాలలు

తమ పిల్లలకు ఉన్నతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఉన్నదానికి మించి అప్పులు చేసి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో డొనేషన్లు, రక రకాల ఫీజులతో తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

డొనేషన్ల వసూలుపై చర్యలు తీసుకోవాలి..: బీవీఎం విఠల్, బీవీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అడ్డగోలుగా డొనేషన్లు వసూలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాలు, టై బెల్టులు విక్రయిస్తున్న ప్రయివేటు పాఠశాల పై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి.

నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు : రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు పాఠశాలల పై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల వద్ద నుంచి డొనేషన్లు వసూలు చేయడం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, టై బెల్టులతో పాటు ఇతర సామాగ్రిని విక్రయిస్తే చర్యలు.


Tottada Srinivas. Scholl psychologist. And. Journalist...

3
1212 views