
ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి
పినపాక మండలం, టీ కొత్తగూడెం గ్రామపంచాయతీ, ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజాపంథా ప్రతినిధి బృందం ఉమేష్ చంద్ర నగర్ గ్రామాన్ని సందర్శించి, సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఆపద సమయంలో ప్రయాణాలు కొనసాగించాలంటే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, అనేక సందర్భాలలో ఈ గ్రామానికి చెందిన ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్ కి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడ్డామని, ఇటీవల గర్భిణీ స్త్రీ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలంటే రహదారి లేక, వాహనాలు వచ్చే పరిస్థితి లేక మంచానికి జట్టి కట్టి రెడ్డిగూడెం వరకు మనుషులతో మోసుకెళ్లి అక్కడి నుండి వాహనంలో హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగిందని, రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని మాకు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారని అన్నారు. వారి కోరిక న్యాయమైనదే కనుక సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకపక్క చంద్రమండలానికి పోయి వస్తున్నా, మరోపక్క ఏజెన్సీలోని అనేక గ్రామాలకు రహదారులు, విద్యా, వైద్యం, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు నేటికీ కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు.