విధులకు ఆటంకపరిచారని ఫిర్యాదు
శ్రీకాకుళం : జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో గతంలో సహాయ సంచాలకులుగా పనిచేసిన పి.సూర్యారావు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది విధులకు ఆటంకపరుస్తున్నారంటూ ప్రస్తుత ఆ శాఖ సంయుక్త సంచాలకుడు రాజగోపాల్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ పి.ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. గతంలో సస్పెన్షన్కు గురైన సూర్యారావుకు హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ క్రమంలో సూర్యారావు కొంతమంది పత్రికా విలేకరులు, వీడియోగ్రాఫర్లను తన వెంట జిల్లా పశుసంవర్ధక కార్యాలయానికి తీసుకెళ్లి విధి నిర్వహణ నిమిత్తం తాను వచ్చానని, అటెండెన్సు రిజిస్టర్లో సంతకం పెడతానంటూ చెప్పడమే కాక వచ్చే పత్రికా విలేకరులతో వీడియో రికార్డింగ్ చేయించారన్నారు. పశుసంవర్ధక శాఖ విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి తగు ఉత్తర్వులు వచ్చేంతవరకు కార్యాలయంలో సూర్యారావును జాయిన్ చేసుకునే అవకాశం లేదని ఎంత చెప్పినప్పటికీ సిబ్బందిని భ భయభ్రాంతులకు గురిచేసి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.