ఐటీఐల్లో ప్రవేశాలకు ఆహ్వానం
శ్రీకాకుళం: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైందని ఐటీఐ ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ లండ సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 5 నుంచి 10 వరకూ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, మోటార్ వెహికల్, డ్రాఫ్ట్మెన్, సివిల్ ట్రేడ్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కట్టింగ్, టైలరింగ్, కోపా తదితర ట్రేడ్లలో ప్రవేశాలను కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని మూడు ప్రభుత్వ కళాశాలలో 640 సీట్లు, 20 ప్రైవేటు కళాశాలల్లో 2,872 సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.