
తుని రైలు దగ్ధం ఘటనలో తెదాపా కూడా ముద్రగడకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా?
ఆంధ్ర ప్రదేశ్ లో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన తుని రైలు దహనం ఘటన తీవ్ర కలకలం రేపింది. కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో అప్పట్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ఆపి నిరసనకారులు తగులబెట్టారు. అయితే ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత విజయవాడ కోర్టు ముద్రగడ పద్మనాభం సహా ఇతర నిందితుల్నీ నిర్దోషులుగా విడిచి పెట్టింది.
ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేవన్న కారణంతో విజయవాడ రైల్వే కోర్టు గతంలోనే ఈ తీర్పు ఇచ్చింది. ఇది జరిగి ఏడాది దాటిపోయిన తర్వాత ప్రభుత్వం నిన్న ఈ కేసులో రైల్వే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. అయితే సర్కార్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. గత ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సామాజిక వర్గాన్ని ఇది కెలికినట్లవుతుందన్న అభిప్రాయం ప్రభుత్వంలో వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గింది.
తుని ఘటనపై రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్లేందుకు నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం ఇవాళ ఉపసంహరించుకుంది. మే 1న విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంటూ ఇవాళ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఇందులో రైల్వే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లరాదని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో తేనెతుట్టెను కదపకుండా ప్రభుత్వం చివరి నిమిషంలో తెలివిగా వ్యవహారించింది.