
తప్పుడు ఆరోపణలు చేసి నా ఆస్తిని టీడీపీ మాజీ మంత్రి కబ్జా చేశారు -ఎనరై మురళి మోహన్ ఆవేదన
ఏపీ టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన ఆస్తిని కబ్జా చేశారని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుడు రావి మురళీ మోహన్ ఆరోపించారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలోని చిలకలూరిపేటలో తనకు సాయికార్తీక్ సిటీ సెంటర్ పేరుతో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని తెలిపారు. సదరు కాంప్లెక్స్లో రెండు థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, రెండు అంతస్తుల వాణిజ్య సముదాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటి విలువ సుమారు రూ.69 కోట్ల ఉంటుందని చెప్పారు.
ఉద్యోగరీత్యా తాను 20 సంవత్సరాలుగా అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నానని మురళీమోహన్ తెలిపారు. గత పది నెలల క్రితం ఏపీకి చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన షాపింగ్ కాంప్లెక్స్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాని తెలిపారు. తన తండ్రి కందిమల్ల అంజిబాబు అనే వ్యక్తి వద్ద రూ.97లక్షల రుణం తీసుకున్నాడని ఆరోపిస్తూ తన ఆస్తులను కబ్జాదారులు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. నిజంగానే రుణం తీసుకుంటే తాను మొత్తం చెల్లిస్తానని చెప్పారు. రుణం పేరుతో తన ఆస్తిని కబ్జా చేస్తున్నారని, వారికి మాజీ మంత్రి పత్తిపుల్లారావు సహకారం ఉందన్నారు. ఈ విషయంపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టడం లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. తన ఆస్తులను కబ్జా చేసిన వ్యక్తులందరూ టీడీపీ పార్టీయే కావడంతో సరైన చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. తనకు టీడీపీతో 37 సంవత్సరాల అనుబంధం లేదని, ఆ పార్టీ ఎన్ఆర్ఐ సెల్కు తాను సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.