logo

యోగా సాధన తోనే సత్వగుణం

యోగా అనేది మన భారతీయ వారసత్వ సంపదని,యోగ సాధనతో మనిషి జీవనశైలిలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని,చక్కని ఆరోగ్యంతో పాటు, మనసు,బుద్ధి,ఆలోచనల్లో కూడా పరిశుభ్రమైన మార్పులు కన్పిస్తాయని రోలుగుంట ఎంపీడీవో నాగేశ్వరరావు చెప్పారు. శుక్రవారం రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద యోగాంధ్ర 2025 కార్యక్ర మంలో భాగంగా యోగా ప్రొటోకాల్ ఆసనాలు సాధన చేస్తున్న ఉద్యోగులనుద్దేశించి ఆయన మాట్లాడారు. యోగా,ప్రాణాయామం, ధ్యానంతో సత్వగుణం అలవడుతుందని,దీని వల్ల మనిషి అరిషడ్వర్గాలకు దూరంగా వుంటాడని, అప్పుడే మానసిక ప్రశాంతత,ఉల్లాసం కలుగుతుందన్నారు. పురాతనం నుంచి హిందూ సంప్రదాయంలో పలు ఆలయాలు,గృహాల్లో చేస్తున్న పూజల్లో కూడా యోగసనాలు,ప్రాణాయామం,అనేక ముద్రలు కూడా వున్నాయని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే
ఎంఈఓ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలందరికీ చక్కని ఆరోగ్యం కలగాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చామని అన్నారు. ఈరోజు ఆఖరి రోజు సుమారు 200 మంది ఉద్యోగులకు యోగా మాస్టర్ ట్రైనీలుతో యోగాసనాలను ప్రాక్టీస్ చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోలుగుంట మండలంలో గల అన్ని ప్రభుత్వ ప్రైవేట్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

47
2411 views