logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దుగ్గిరాల.నర్సులకు ఫ్లోరెన్స్ నైయిటింగేల్పురస్కారాల ప్రధానోత్సవం...

తేదీ: 26-05-2025
ఈరోజు ఉదయము దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, క్రొవ్వొత్తి వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, డాక్టర్ సి. ఇందిరా మరియుతాడిబోయిన రామస్వామి యాదవులు మాట్లాడుతూ *"ప్రపంచ ఆరోగ్య సంస్థవారు మే 12వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరము 'మన నర్సులు - మన భవిష్యత్తు' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. మానవులకు సేవ చేయడానికి భగవంతుడు కల్పించిన అవకాశమే వైద్య రంగం. దీనిలో ప్రధానమైనది నర్సింగ్ వృత్తి. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధము ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవకూడా అంతే ముఖ్యం"* అని అన్నారు. " *ఫ్లోరెన్స్ నైటింగేల్ 1812 మే 12వ తేదీన ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఆ రోజులలో వైద్యశాలలు శుచి, శుభ్రతలు లేకుండా అధ్వాన్న స్థితులలో ఉండేవి. నైటింగేల్ తన తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా సేవ చేయడానికే నర్సింగ్ వృత్తిని ఎంచుకొని జర్మనీ, ఐర్లాండులలో పనిచేసి అక్కడ వైద్యశాలల పరిస్థితులలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మెరుగు పరిచింది. తిరిగి లండను వచ్చి అక్కడి హాస్పటళ్ళలో పరిశుభ్రతకు ప్రాధాన్యతతో పాటు రోగులకు పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాటు చేసింది. 1854 క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. తోటి నర్సులను కూడగట్టుకుని ఆ యుద్ధంలో క్షతగాత్రులైన సైనికులకు నిరుపమానమైన సేవలు అందించింది. ఎంతో గుండె నిబ్బరముతో చిమ్మ చీకట్లలో చిరుదీపం వెంట తీసుకొని వెళ్ళి రోగులకు సేవలందించి, వారిలో బ్రతుకుతాము అనే ఆశలు చిగురింపజేసింది. వారి ముఖముపై చిరునవ్వు ఆమె చేతిలోని దీపం లాగా వెలిగేది. రోగులకు కావలసిన మందులు, పరికరాలను పంపమని ఆనాటి ప్రభుత్వానికి అర్జీలు పంపేది. రోగులకు ఆసుపత్రిలో చోటు సరిపోకపోతే అధికారులను ఒప్పించి పాత ఇళ్ళను, పాత భవనాలను ఆసుపత్రులుగా మార్చేది. 'త్రాగుడుకు డబ్బు ఖర్చు పెట్టకండి. ఆ డబ్బును మీ ఇంటికి పంపితే ఇల్లు గడుస్తుంది కదా' అని రోగులకు హితబోధ చేసేది. గ్రంథాలయాలు, చుదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్టు చూసి అక్షరాస్యతను పెంచింది. ఆమె నోట్స్ ఆన్ హస్పటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్ అనే గ్రంథాలను వ్రాయడమే కాకుండా విక్టోరియా రాణికి అలాగే ప్రభుత్వ అధికారులకు హాస్పిటల్స్ బాగుకొరకు అభ్యర్థనలను పంపేది. నాటినుండి నర్సింగ్ వృత్తికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభమయింది. 1860 సంవత్సరము జూన్ 24న ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ అనే సంస్థను లండనులో స్థాపించింది. ఆమెను మదర్ ఆఫ్ మోడ్రన్ నర్సింగ్ గా గుర్తించారు. ఆవిడ భారతదేశానికి కూడా యితోధిక సేవలందించారు. 1859వ సంవత్సరములో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమీషనును నియమించింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ సూచనలు, సలహాల మేరకు భారతదేశంలో శానిటరీ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని వలన మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ మరలా పుట్టి నేటి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను మెరుగు పరచాలని కోరుకుందాం. సేవానిరతి గల ప్రతి నర్సులోనూ ఆమె కలకాలం జీవించి ఉంటుంది. నర్సులు, రోగులు గుర్తుంచుకోవలసిన ఆదర్శ మూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్ "* అని అన్నారు.
" *ఆవిడ నర్సింగ్ వృత్తికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆవిడ జన్మదినమైన మే 12వ తారీఖునాడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. నేటి యువ నర్సులు ఆవిడ జీవితాన్ని ఆదర్శంగా తీసికొని, రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలి"* అని కోరారు. " *కనిపించే దేవుళ్ళు వైద్యులైతే, కాపాడే దేవతలు నర్సులు"* అని కొనియాడారు. తదనంతరం నర్సుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మానవసేవే మాధవసేవగా భావించి రోగులపట్ల ప్రేమానురాగాలు చూపిస్తున్న దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సేవామూర్తులైన 5 మంది నర్సులకు ఉత్తమ నర్సు పురస్కారము (శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్ఛం)లతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు వెనిగళ్ళ శ్రీకృష్ణ ప్రసాద్, కొంగర జోగేంద్ర,జెట్టి బాల రాజు, దోస్త్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, కొండపనేని రవి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు షేక్ సుభాని, నల్లనూకల
వెంకటేశ్వరరావు, కుర్రా నాగయ్య, రాధకృష్ణ యాదవ్, హనుమాన్, జంపాల నరేంద్రనాద్, చుండురు ఉమామహేశ్వరావు, తాడిబోయిన శ్రీధర్ ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

185
6855 views